Reading Time: < 1 minute

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌డీ (పీబీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పీజీఈసెట్‌–2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 6 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పీజీఈసెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత కోర్సును బట్టి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ ఈఏపీసెట్‌–2026లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా బయోటెక్నాలజీ, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కెమికల్‌, ఫుడ్‌ టెక్నాలజీ, ఫార్మసీ తదితర విభాగాల్లో సీట్లు కేటాయిస్తారు. ఆలస్య రుసుము లేకుండా మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రవేశ పరీక్షలు ఏప్రిల్‌ 28, 29, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. హాల్‌టికెట్లు ఏప్రిల్‌ 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఫలితాలు మే 14, 2026న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.