class="wp-singular post-template-default single single-post postid-785 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ పరిధిలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయిన నాగేశ్వరరావు తన భార్య సంధ్యశ్రీని హత్య చేసిన కేసులో బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

బొమ్మనహళ్లి ప్రాంతంలోని వర్చుసో అపార్టుమెంట్‌లో ఈ దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమార్తె అమెరికాలో స్థిరపడింది. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగానే జీవిస్తున్నారని పరిసరాలు చెబుతున్నాయి. భార్యపై నాగేశ్వరరావుకు అపారమైన ప్రేమ ఉందని కూడా తెలిసింది.

అయితే ఇటీవల కొంతకాలంగా నాగేశ్వరరావు డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాను చనిపోతే భార్యను ఎవరు చూసుకుంటారు, ఆమె ఎలా జీవిస్తుందనే ఆందోళన అతడిని తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని విచారణలో తేలింది. ఈ ఆలోచనల మధ్య కఠిన నిర్ణయం తీసుకున్న నాగేశ్వరరావు, భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు సమాచారం. సంధ్యశ్రీని గొంతు కోసి హత్య చేసిన అనంతరం తాను కూడా ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు.

సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హత్య విషయాన్ని అమెరికాలో ఉన్న వారి కుమార్తెకు తెలియజేసినట్లు అధికారులు తెలిపారు. డిప్రెషన్ కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.