class="wp-singular post-template-default single single-post postid-973 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆహార నాణ్యతతో పాటు మెనూ అమలు విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు.

మెనూ ప్రకారం విద్యార్థులకు కిచిడీ, గుడ్డు, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ వడ్డించాల్సి ఉండగా, అక్కడ మాత్రం వైట్ రైస్, గుడ్డు, సాంబార్ మాత్రమే అందిస్తున్నట్లు ఆయన గుర్తించారు. కామన్ డైట్ మెనూను ఎందుకు పాటించలేదని పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు. అదేవిధంగా అన్నం సరిగా ఉడకకపోవడం, సాంబార్ పసుపు నీళ్లలా ఉండటంపై కూడా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నాసిరకం భోజనం ఎవరూ తినలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి, ఫుడ్ చెకింగ్ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్‌కు ఫోన్ ద్వారా ఆదేశించారు. ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని సూచించారు.

అనంతరం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా పాఠశాల ఆవరణలో స్వయంగా చీపురు పట్టి శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదాం రమేష్‌లతో కలిసి చెత్తను తొలగించారు.

ఇదే సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన 44 దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.