Reading Time: < 1 minute

ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మబొజ్జు పటేల్, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య తదితరులు హాజరయ్యారు.

ఈ జాబ్ మేళాలో ఆదిలాబాద్‌తో పాటు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన మొత్తం 67 కంపెనీలు పాల్గొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 7500 మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

జాబ్ మేళా ద్వారా 2100 మంది అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఎంపికైన అభ్యర్థులకు కార్యక్రమం సందర్భంగా అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రతులను అందజేశారు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.45 వేల వరకు వేతనం లభించే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, ఏఎస్పీలు మౌనిక, రుత్విక్ సాయి, డీఎస్పీలు జీవన్ రెడ్డి, ఇంద్రవర్ధన్, శ్రీనివాస్, శిక్షణలో ఉన్న ఐపీఎస్ రాహుల్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.