Reading Time: < 1 minute

అత్తాపూర్‌లోని పిల్లర్ నెంబర్‌ 185 సమీపంలో ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్స్ సుజుకి కార్ల షోరూంలో మంగళవారం అర్ధరాత్రి 1:20 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన సమయంలో షోరూంలో సుమారు 50 నుంచి 70 వరకు కార్లు ఉన్నట్లు సమాచారం. షోరూం సర్వీస్ సెంటర్‌లోని స్క్రాప్ గోదాం నుంచి మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో నాలుగు నుంచి ఐదు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

మంటలను గమనించిన సమీప అపార్ట్మెంట్ నివాసులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్‌లతో అక్కడికి చేరుకుని వేగంగా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. భద్రతా చర్యలుగా సమీప అపార్ట్మెంట్‌లో నివసిస్తున్న సుమారు 90 కుటుంబాలను పోలీసులు ముందస్తుగా ఖాళీ చేయించారు.

ఈ ఘటనకు షోరూం నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తుండగా, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా షోరూం యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.