ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ దంతవైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కారు అదుపుతప్పి ముందున్న వాహనాన్ని ఢీకొట్టి అనంతరం డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చాగల్లు మండలానికి చెందిన జోన్నకూలి లిఖిత (23) ఓ ప్రైవేటు కళాశాలలో డెంటల్ కోర్సు చదువుతోంది. రాజమహేంద్రవరంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్లో నివసిస్తూ చదువు కొనసాగిస్తోంది.
శుక్రవారం రాజమహేంద్రవరం నుంచి హాస్టల్కు ఆమె తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా, రాజానగరం–దివాన్ చెరువు మధ్యలో గుర్తుతెలియని వాహనాన్ని కారు ఢీకొంది. అనంతరం అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న లిఖిత అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బొమ్మూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
