స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే కొంతకాలానికి అవసరం లేకపోవడం, పాడవడం వంటి కారణాలతో పాత సిమ్ కార్డులను చాలామంది పక్కన పడేస్తుంటారు. కానీ అలాంటి నిరుపయోగంగా కనిపించే సిమ్ కార్డుల నుంచే ఓ వ్యక్తి ఏకంగా రూ.26 లక్షల విలువైన బంగారాన్ని వెలికితీయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ ఘటన Chinaలో వెలుగుచూసింది. పాత సిమ్ కార్డుల నుంచి బంగారాన్ని తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా నిలిచింది. ఈ వీడియోను క్వియావో అనే వ్యక్తి జనవరి 20, 2026న సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతడు గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని Huizhou నగరంలో నివసిస్తున్నాడు.
వీడియోలో క్వియావో పాత సిమ్ కార్డులను రసాయనాలతో నిండిన డ్రమ్లో వేసి, కడగడం, కాల్చడం వంటి ప్రక్రియల ద్వారా బంగారాన్ని వెలికితీసినట్లు చూపించాడు. ఈ విధానంలో ఆయన మొత్తం 191.73 గ్రాముల బంగారాన్ని సేకరించగా, దీని విలువ సుమారు 200,000 యువాన్లు (రూ.26.59 లక్షలు)గా ఉంది. దాదాపు రెండు టన్నుల ఈ-వ్యర్థాల నుంచి ఈ బంగారం లభించిందని ఆయన వెల్లడించాడు.
అయితే ఈ ప్రక్రియ చాలా ప్రమాదకరమని, సాధారణ ప్రజలు ప్రయత్నించకూడదని క్వియావో హెచ్చరించాడు. కొన్ని సందర్భాల్లో ఇది చట్టవిరుద్ధం కూడా కావచ్చని ఆయన స్పష్టం చేశాడు.

