Reading Time: < 1 minute

కర్ణాటక రాష్ట్రంలో ప్రేమ వ్యవహారం ఘర్షణకు దారి తీసిన ఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ప్రియుడు నిరాకరించడంతో ఓ యువతి అతడిపై కత్తితో దాడి చేసిన సంఘటన రామనగర జిల్లా బిడాడి పట్టణంలో వెలుగుచూసింది. పోలీసులు నిందితురాలిని 30 ఏళ్ల సుధగా, బాధితుడిని 27 ఏళ్ల వేణుగోపాల్‌గా గుర్తించారు. ఘటన అనంతరం సుధను అరెస్ట్ చేశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, సుధ మరియు వేణుగోపాల్ మధ్య ఏడాది కాలంగా ప్రేమ సంబంధం కొనసాగుతోంది. జిమ్‌లో పరిచయమైన వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వేణుగోపాల్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తుండగా, సుధ ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే గత నాలుగు నెలలుగా వేణుగోపాల్ సుధకు దూరంగా ఉంటూ, వివాహానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. అతను మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని సుధ అనుమానించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముందుగానే కత్తిని తన బ్యాగ్‌లో తీసుకెళ్లిన సుధ, వేణుగోపాల్‌ను ఇంటి బయటకు రమ్మని పిలిచి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో వేణుగోపాల్ ఛాతీ, కడుపు, చేతులపై గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.

సుధను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారం హింసకు దారి తీసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Disclaimer : ఈ వార్త ప్రాథమిక పోలీసు సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి వివరాలు మారవచ్చు.