తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. హైదరాబాద్ సనత్నగర్లో నిర్మించిన టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఉగాది రోజున ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే అత్యాధునిక వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. దాదాపు పనులన్నీ పూర్తయ్యాయని, మిగిలిన సివిల్ వర్క్స్, ఎక్విప్మెంట్ ట్రయల్స్ త్వరలో ముగుస్తాయని అధికారులు తెలిపారు.
1000 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో ఓపీ రూములు, ప్రత్యేక ఇన్పేషెంట్ వార్డులు, 16 ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్రే వంటి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. రోగుల కోసం హెచ్ఎంఐఎస్ సాఫ్ట్వేర్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జి వరకు సేవలు నిర్వహించనున్నారు. పారిశుద్ధ్యం, భద్రత, పేషెంట్ కేర్ సేవలను ఆధునిక ప్రమాణాలతో అమలు చేయనున్నారు.
డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది నియామకాలు కొనసాగుతున్నాయి. ముందుగా నిమ్స్ పరిధిలోని సీనియర్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. టిమ్స్ ప్రారంభంతో పేదలకు ఉచిత కార్పొరేట్ స్థాయి వైద్యం అందనుంది.
