Reading Time: < 1 minute

మహిళల గర్భదారణ హక్కులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అవాంఛిత గర్భాన్ని కొనసాగించాలని ఏ మహిళను బలవంతం చేయలేమని, ముఖ్యంగా మైనర్ బాలికల విషయంలో వారి హక్కులకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

మైనర్‌గా ఉన్న ఒక బాలికకు సంబంధించిన 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇస్తూ, ఇలాంటి సున్నితమైన కేసుల్లో బాలిక అభిప్రాయం, భవిష్యత్తు, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఒక మహిళ తన ఇష్టానికి విరుద్ధంగా తల్లి కావాల్సిందేనని చెప్పడం ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ కేసులో మైనర్ బాలిక ఒక యువకుడితో ఏర్పడిన సంబంధం కారణంగా గర్భవతి అయిందని కోర్టు వెల్లడించింది. అయితే ఆ సంబంధం సమ్మతితో జరిగిందా లేదా అన్న అంశం ఈ కేసులో కీలకం కాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా బాలికకు గర్భాన్ని కొనసాగించాలనే ఇష్టం లేదన్న విషయమే ప్రధానమని నొక్కి చెప్పింది.

మైనర్ బాలిక గర్భం దాల్చడం దురదృష్టకర పరిస్థితే అయినప్పటికీ, అలాంటి సందర్భాల్లో గర్భాన్ని కొనసాగించమని ఒత్తిడి చేయడం ఆమె స్వయంప్రతిపత్తికి భంగం కలిగిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. బాలిక భవిష్యత్తు, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

మహిళకు తన గర్భంపై నిర్ణయం తీసుకునే హక్కు రాజ్యాంగ పరిరక్షిత హక్కు అని స్పష్టం చేసిన ధర్మాసనం, వైద్య నిబంధనల ప్రకారం అబార్షన్‌కు అనుమతి ఇచ్చింది. ముంబైలోని జేజే ఆసుపత్రిలో అన్ని వైద్య ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటిస్తూ గర్భస్రావం నిర్వహించాలని ఆదేశించింది.

మహిళల శారీరక స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కుల పరిరక్షణ దిశగా ఈ తీర్పు చారిత్రాత్మకమైనదిగా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.