Reading Time: < 1 minute

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడే లోహంగా బంగారం నిలుస్తోంది. బంగారం డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుతున్నాయి. అయితే భారతదేశంతో పోలిస్తే కొన్ని దేశాల్లో బంగారం కొంత తక్కువ ధరకు లభిస్తుండటంతో, విదేశాలకు ప్రయాణించే వారు అక్కడి నుంచి బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి బంగారం భారత్‌కు తీసుకురావడంపై ఉన్న నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది.

విదేశాల నుంచి భారతదేశానికి బంగారం తీసుకువచ్చే వారికి కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. అయితే ఒక నిర్దిష్ట పరిమితి వరకు బంగారాన్ని సుంకం లేకుండా తీసుకురావడానికి అనుమతి ఉంటుంది. గతంలో ఈ పరిమితి రూ.50 వేల విలువ వరకు మాత్రమే ఉండేది. తాజాగా దీనిని రూ.75 వేల వరకు పెంచారు. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 2, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి.

కొత్త నియమాల ప్రకారం భారతదేశ నివాసితులు లేదా పర్యాటక వీసా కాకుండా ఇతర వీసాలపై భారత్‌కు వచ్చే విదేశీయులు కస్టమ్స్ సుంకం లేకుండా రూ.75 వేల విలువైన బంగారాన్ని తీసుకురావచ్చు. విదేశీ పర్యాటకులు మాత్రం సుంకం లేకుండా సుమారు రూ.25 వేల విలువైన బంగారాన్ని మాత్రమే తీసుకురావడానికి అనుమతి ఉంది.

అలాగే భారత పౌరులైన మహిళలు, ఒక సంవత్సరం కంటే ఎక్కువకాలం విదేశాల్లో నివసించిన మహిళలు 40 గ్రాముల వరకు బంగారాన్ని సుంకం లేకుండా తీసుకురావచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పురుషులు 20 గ్రాముల వరకు బంగారాన్ని కస్టమ్స్ సుంకం లేకుండా భారత్‌కు తీసుకురావచ్చని స్పష్టం చేసింది. ఈ మార్పులతో ప్రయాణికులకు కొంత ఊరట కలిగినట్లుగా భావిస్తున్నారు.