Reading Time: < 1 minute

లిబియాలో మాజీ అధ్యక్షుడు ముఅమ్మర్ గద్దాఫీ కుమారుడు సైఫ్ అలిస్‑ఇస్లాం గద్దాఫీ (53) హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని లిబియా అధికారులు మరియు గద్దాఫీ కుటుంబ వర్గాలు గురువారం అధికారికంగా ధృవీకరించాయి.

లిబియా పశ్చిమ ప్రాంతంలోని జింటన్ నగరంలో ఉన్న సైఫ్ అలిస్-ఇస్లాం నివాసంపై నలుగురు మాస్కులు ధరించిన గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లు సమాచారం. ఇంట్లోకి ప్రవేశించే ముందు భద్రతా కెమెరాలను నిలిపివేసిన దుండగులు, అనంతరం సైఫ్ అలిస్-ఇస్లాంను కాల్చి హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగిందని, దాడి సమయంలో భద్రతా వ్యవస్థను ముందుగానే అచేతనం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దాడికి కారణాలు ఏమిటన్న అంశంపై, అలాగే నిందితుల వివరాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

సైఫ్ అలిస్-ఇస్లాం గద్దాఫీ లిబియా రాజకీయాల్లో వివాదాస్పద నేతగా గుర్తింపు పొందారు. 2011లో నాటో మద్దతుతో జరిగిన లిబియా తిరుగుబాట్ల సమయంలో తన తండ్రి పాలన కూలిపోయిన అనంతరం ఆయనను తిరుగుబాటు దళాలు అరెస్టు చేశాయి. అనంతరం కొంతకాలం నిర్బంధంలో ఉన్న సైఫ్ అలిస్-ఇస్లాంను విడుదల చేశారు.

2021లో లిబియా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సిద్ధమైనప్పటికీ, రాజకీయ అస్థిరత కారణంగా ఎన్నికలు వాయిదా పడిపోయాయి. ప్రస్తుతం లిబియాలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నడుమ ఈ హత్య ఘటన దేశ పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.