Reading Time: 2 minutes

తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించేందుకు తెలంగాణ విద్యా కమిషన్ విస్తృత సిఫారసులు చేసింది. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీకి చెక్ పెట్టడం, ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం, విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడం వంటి అంశాలపై కీలక ప్రతిపాదనలు చేసింది. గురువారం హైదరాబాద్‌లో కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి “తెలంగాణ విద్యా విధానం–2026” నివేదికను సమర్పించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించి ప్రజలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఈ నివేదిక రూపొందించబడింది.

ఇంటర్మీడియట్ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని కమిషన్ అభిప్రాయపడింది. ఇంటర్ ను ప్రత్యేక విభాగంగా కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేసి, 11వ, 12వ తరగతులుగా కొనసాగించాలని సూచించింది. విద్యార్థులపై మానసిక ఒత్తిడిని పెంచుతున్న టీజీ ఎప్సెట్ ప్రవేశ పరీక్షను రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగానే ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. 10వ, 12వ తరగతుల్లో మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించి, 11వ తరగతి బోర్డు పరీక్షను రద్దు చేయాలని సూచించింది.

ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు అన్ని సర్కారు పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించాలని, నర్సరీ నుంచి పీజీ వరకు ఇంగ్లిష్ మీడియం కొనసాగించాలని పేర్కొంది. రాబోయే ఐదేళ్లలో ప్రతి ఏడాది 400 చొప్పున మొత్తం 2,000 “తెలంగాణ పబ్లిక్ స్కూల్స్” ఏర్పాటు చేసి, ఒక్కో స్కూల్‌లో 1,500 అడ్మిషన్లు కల్పించాలని సూచించింది. బస్ సౌకర్యంతో పాటు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించాలని తెలిపింది.

విద్యా ప్రమాణాల పెంపు కోసం పాస్ మార్కులను పెంచాలని కమిషన్ సిఫారసు చేసింది. స్కూల్, ఇంటర్ స్థాయిల్లో 35 శాతం నుంచి 45 శాతానికి, డిగ్రీ, పీజీ కోర్సుల్లో 50 శాతానికి ఉత్తీర్ణత ప్రమాణాన్ని పెంచాలని సూచించింది. టీచర్ల అర్హతల్లో మార్పులు చేస్తూ డీఈడీ కోర్సును రద్దు చేసి, డిగ్రీతో పాటు బీఈడీ తప్పనిసరి చేయాలని పేర్కొంది. ఆటోమేటిక్ ప్రమోషన్లు రద్దు చేసి, పనితీరు ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని ప్రతిపాదించింది.

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజు నియంత్రణ కోసం చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలని, కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టాల్లో సవరణలు చేయాలని సూచించింది. వర్సిటీల్లో వైస్ ఛాన్స్లర్లుగా ఐఏఎస్ అధికారుల బదులుగా అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లను నియమించాలని పేర్కొంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రద్దు చేసి రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని తెలిపింది.

విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 18 శాతం నిధులు కేటాయించాలని కమిషన్ స్పష్టం చేసింది. స్కూళ్ల ర్యాంకింగ్, విద్యార్థుల అంచనాల కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్యను విస్తరించాలని సూచించింది.

Disclaimer : ఈ వ్యాసం కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా రూపొందించబడింది. తుది నిర్ణయాలు ప్రభుత్వ ఆమోదానికి లోబడి ఉంటాయి.