class="wp-singular post-template-default single single-post postid-1263 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

Crime Exposed సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లను వేదికగా చేసుకుని నెల్లూరులో హైటెక్ వ్యభిచారం జరుగుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆకర్షణీయమైన ప్రకటనలు పెట్టి, యువతను మోసం చేస్తూ ఈ చీకటి వ్యాపారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గ్రూప్‌లలో చేరిన వెంటనే అమ్మాయిల ఫోటోలు, రేట్లు పంపిస్తూ కస్టమర్లను ఆకర్షించి, లాడ్జ్ బుకింగ్ కూడా తమదే అని చెప్పి నిర్దిష్ట ప్రాంతాలకు పంపిస్తున్నట్లు విచారణలో బయటపడింది. బాలాజీ నగర్, చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని లాడ్జిలను ఈ అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

టౌన్ ASP ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో సుమారు 30 మంది మహిళలు, విటులు అదుపులోకి తీసుకోబడ్డారు. ఒకే వ్యక్తి మూడు లాడ్జిలను నిర్వహిస్తూ ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బయట ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి, స్థానిక మహిళలతో కలిసి ఈ దందాను నడిపిస్తున్నట్లు వెల్లడైంది.

‘పీఎస్‌కే గ్రాండ్ ఆర్గనైజర్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, కొత్తగా వచ్చే యువతుల ఫోటోలు, రేట్లు అందులో పోస్ట్ చేస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో మఫ్టీలో నిఘా ఏర్పాటు చేసి, నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

దాడుల్లో పట్టుబడిన కొంతమంది కాలేజ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదివరకూ కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో స్పా సెంటర్లు, లాడ్జిలపై దాడులు జరిగి ఇలాంటి కార్యకలాపాలు బయటపడినప్పటికీ, నిర్వాహకులపై సరైన చర్యలు తీసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై పోలీసుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వస్తుండగా, ఇటీవల ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Disclaimer : ఈ వార్త అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి వివరాలు మారే అవకాశం ఉంది.