Reading Time: < 1 minute

రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో పొడి వాతావరణం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ కాలంలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుంచి 3°C వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది.

చలి కారణంగా ఉదయపు వేళల్లో ప్రజలు స్వెటర్లు, మంకీ క్యాప్‌లతో బయటకు వస్తుండగా, దట్టమైన పొగమంచు వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.