class="wp-singular post-template-default single single-post postid-373 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

సామాన్య వినియోగదారులకు మరోసారి బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తాజా జెఫ్రీస్ నివేదిక ప్రకారం, 2026 జూన్ నాటికి మొబైల్ టారిఫ్‌లను సుమారు 15 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. గతంలో జరిగిన టారిఫ్ సవరణల ట్రెండ్‌ను చూస్తే ఇదే సరైన సమయమని నివేదిక పేర్కొంది. డేటా వినియోగం వేగంగా పెరగడం, ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వైపు వినియోగదారులు మారడం వల్ల ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం ఇప్పటికే పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

ఈ టారిఫ్ పెంపు ప్రభావంతో 2027 ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగ ఆదాయం సుమారు 16 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2026లో నమోదయ్యే వృద్ధికి దాదాపు రెండింతలు. ధరలు 15 శాతం పెరిగితే, వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం కూడా 14 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

అయితే ధరల పెంపుతో కొత్త వినియోగదారుల చేరిక కొంత మందగించే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది.

కంపెనీల వారీగా ప్రభావం భిన్నంగా ఉండనుంది. రిలయన్స్ జియో 10 నుంచి 20 శాతం వరకు ధరలు పెంచే అవకాశముండగా, భారతి ఎయిర్‌టెల్తో సమాన స్థాయిలో నిలవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అంచనా. మరోవైపు, అప్పుల భారం ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా 2027–2030 మధ్య కాలంలో మొత్తం మీద 45 శాతం వరకు ధరలు పెంచాల్సిన పరిస్థితి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

5జీ నెట్‌వర్క్ నిర్మాణం ప్రధాన దశ పూర్తవుతుండటంతో ఖర్చులు తగ్గి, లాభాల మార్జిన్లు మెరుగుపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.