class="wp-singular post-template-default single single-post postid-966 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

ఆంధ్రప్రదేశ్
అనకాపల్లి జిల్లా
తేదీ: 10-03-2026

అనకాపల్లి జిల్లా వి. మాడుగుల మండలం ఆవురువాడ పంచాయతీ పరిధిలోని పశువులబంద్ కొండ శిఖర గ్రామంలో నివసిస్తున్న పీవీటీజీ కొందు గిరిజనులు తీవ్ర మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో కేవలం 7 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజూ సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని జీలుగులో గ్రామానికి గుర్రాలపై బిందెలు మోసుకుని నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.

గ్రామస్తులు తాగుతున్న నీరు శుభ్రమైనది కాకపోవడంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని తెలిపారు. రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో అనారోగ్య సమయంలో డోలు కట్టి దూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామానికి తాగునీరు అందించేందుకు ప్రజా ఫిర్యాదు వేదికలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ నుండి రూ.4 లక్షలు ట్యాంకు మరియు పైప్‌లైన్ నిర్మాణానికి మంజూరు చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ గ్రామాన్ని పరిశీలించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని గ్రామస్తులు తెలిపారు.

వేసవి ప్రారంభమవుతున్న నేపథ్యంలో వెంటనే ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసి ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇవ్వాలని గ్రామస్తులు సేదరి కామేశ్వరరావు, సేదరి నాయుడు, సేదరి చిలకమ్మ తదితరులు డిమాండ్ చేశారు.

ఈ విషయంపై సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు స్పందిస్తూ, నిధులు మంజూరై సంవత్సరం గడిచినా పనులు ప్రారంభం కాకపోవడం అన్యాయమని విమర్శించారు. సమస్యను పరిష్కరించకపోతే రాబోయే జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.