class="wp-singular post-template-default single single-post postid-588 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మంగళవారం తృటిలో ఓ పెద్ద విమాన ప్రమాదం తప్పింది. రన్‌వేపై కదులుతున్న సమయంలో Air India మరియు IndiGo కు చెందిన రెండు విమానాల రెక్కలు ఒకదానికొకటి తాకాయి. ఈ ఘటనను ఇరు విమానయాన సంస్థలు అధికారికంగా ధృవీకరించాయి.

అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిరిండియా, ఇండిగో సంస్థలు వెల్లడించాయి. ఘటన జరగడం విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్తతకు దారి తీసినా, పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ముంబై నుంచి Coimbatore కు బయలుదేరాల్సిన AI-2732 విమానం టేకాఫ్‌కు ముందు టాక్సీవేలో వేచి ఉండగా, అదే సమయంలో పక్కగా కదులుతున్న ఇండిగో విమానం రెక్కలు తాకాయి. ఈ ఢీకొన్న ఘటనలో ఎయిరిండియా విమానం రెక్కకు స్వల్ప నష్టం వాటిల్లిందని పేర్కొంది.

భద్రత దృష్ట్యా విమానాన్ని వెంటనే సేవల నుంచి తప్పించి, సాంకేతిక పరీక్షల కోసం నిలిపివేశామని అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దింపి, ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

అలాగే ప్రయాణికులు ఇబ్బందిపడకుండా, వీలైనంత త్వరగా వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేసినట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు, డీజీసీఏ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు సమాచారం.

రన్‌వేలు, టాక్సీవేల్లో భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.